కాశిబుగ్గ: చేనేత కార్మికులు కాలానుగుణంగా మార్కెటింగ్ పెంచుకోవడానికి, ఆర్థికాభివృద్ధికి నూతన డిజైన్ వస్త్రాలను ఉత్పత్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలో చేనేత వాక్ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చేనేత కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. లేటెస్ట్ డిజైన్లతో కూడిన ఉత్పత్తులను చేస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. దాంతో చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కొత్తవాడ దర్రీస్కు ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని వివరించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులు మార్కెట్కు తగిన ఉత్పత్తులు చేసి, చేనేత సంఘాలు పరిపుష్ఠి అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వై.శ్రీకాంత్రెడ్డి, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ నర్సింహమూర్తి, డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్, సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, డీఎస్ మూర్తి, యెలగం కొమురయ్య, యెలగం రవిరాజ్, విజయ్కుమార్, గుండేటి నరేంద్రకుమార్, యెలగం సాంబయ్య, రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సుకన్య సమృద్ధి యోజనతో మేలు
ఖిలా వరంగల్: బాలికల భవిష్యత్ విద్య, ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ప్రాజెక్టు లక్ష్మీనగర్ సెక్టార్ విద్యానగర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి, సీడీపీఓ విద్యతో కలిసి ఆమె శుక్రవారం సందర్శించారు. గర్భిణులకు పండ్ల బుట్టలను కలెక్టర్ అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల సూపరింటెండెంట్ రజినీతో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంట్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
చేనేత దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


