కొత్తకోట రూరల్/ఆత్మకూర్: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు, రోగులకు అత్యుత్తమ, నాణ్యమైన సేవలు అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని 108, 102 వాహనాల రాష్ట్ర ఫ్లీట్ హెడ్ వరప్రసాదరాజు సిబ్బందిని ఆదేశించారు. గురువారం కొత్తకోట, ఆత్మకూర్లోని 108, 102 వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న అత్యవసర వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులు, రోగులను సమీప ఆస్పత్రులకు సకాలంలో తరలించాలని.. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి, ఎగ్జిక్యూటివ్లు రత్నం, దుర్గాప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఖాజా మైనుద్దీన్, రాము, పైలట్లు అక్బర్, చంద్రశేఖర్, ఆత్మకూర్లో మెడికల్ టెక్నీషియన్లు శ్రీనివాస్, సంజీవ్, అజీం ఉన్నారు.


