వనపర్తి: మీసేవా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలో జిల్లాలోని మీసేవా కేంద్రాల నిర్వాహకుల సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. వైకల్య గుర్తింపు కార్డులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కార్మికశాఖ సేవలపై సూచనలిచ్చారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, ఆన్లైన్ విధానం, సేవల ప్రాసెసింగ్ తదితర అంశాలను అధికారులు వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అదనంగా ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి సేవకు నిర్ణయించిన రుసుం వివరాలను కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడంతో పాటు కేంద్రాలను శుభ్రంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని సూచించారు. మీసేవా జిల్లా మేనేజర్ వెంకటేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


