● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శ
వనపర్తి: తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఆంధ్రకు నీళ్లు దోచిపెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముందుగా జూరాల ప్రాజెక్టును పరిశీలించి.. అనంతరం పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తుండగా.. ఆంధ్ర పోలీసులు కర్నూలు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే మీడియాలో మాట్లాడారు. ఎల్నినో పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు సాగు నీళ్లు దోచిపెడుతున్న రేవంత్రెడ్డి సర్కారును రైతాంగం క్షేమించబోదన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఆధారంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దామని వస్తే.. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కూడా పంటలు పండాలి.. అభ్యంతరం లేదు కానీ.. గ్రావిటీతో రోజుకు నాలుగైదు టీఎంసీలు తోడేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వైపున 802 మీటర్లు అడుగున ఉన్న మోటార్లతో ఎత్తిపోయాలని, కేఎల్ఐ మూడు పంప్లు పనిచేస్తున్నా రోజుకు కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోవడం వల్ల.. ఒక టీఎంసీ నీటికే ఐదారు రోజులు సమయం పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘోరమైన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే వచ్చామని పేర్కొన్నారు. కల్వకుర్తి మోటార్లు సరిగా నడపడం లేదని, దీనిపై తాము ఒత్తిడి తెస్తేనే ఎత్తిపోతలు చేపట్టారన్నారు. 162 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వలో 102 కి.మీ., దూరానికి కూడా ఇప్పటికీ నీళ్లు పోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో వంద టీఎంసీలు ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీల నీళ్లు రైతులకు నీళ్లు ఇచ్చామని ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దీనిపై పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆగస్టులో సాగు సీజన్ దాదాపు అయిపోతుందని.. ఈ సమయంలో ఐఏబీ సమావేశంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని చెప్పడం వింతగా ఉందని తెలిపారు. నిన్నటి వరకు జూరాలకు వరద వచ్చిందని.. ఈ సీజన్కు నీటికొరత లేకున్నా ఉన్నట్లు ప్రభుత్వమే రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గట్టుయాదవ్, లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, జగదీశ్వర్రెడ్డి, పలుస రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, కురుమూర్తి యాదవ్, గంధం పరంజ్యోతి ఉన్నారు.


