పోలీసుల అదుపులో
ముగ్గురు నిందితులు
పట్టుబడిన బంగారు,
వెండి సామగ్రి
పెందుర్తి: పదుల సంఖ్యలో దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం విభాగం డీసీపీ లతామాధురి వివరాలు వెల్లడించారు. సుజాతనగర్ సీ–2 జోన్లో నివాసం ఉంటున్న ఇలపండ షణ్ముఖ శ్రీధర్ ఒక ప్రైవేటు కళాశాలలో మెడిసిన్ పీజీ చదువుతున్నాడు. గత నెల 22న శ్రీధర్ తన కుటుంబంతో కలిసి గుంటూరు వెళ్లి, తిరిగి 31న ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 6 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి వస్తువులను దుండగులు ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి క్రైం విభాగం ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డు (87 దొంగతనం కేసులు), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మండెలా నాగభాస్కర్ అలియాస్ బాబీ (82 దొంగతనం కేసులు), కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన మడగల విజయ్కుమార్ (86 దొంగతనం కేసులు) అని తేల్చారు. నిందితుల కోసం గాలిస్తుండగా సోమవారం మధ్యాహ్నం సరిపల్లి వద్ద వారు పట్టుబడినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో ఏడీసీపీ రమ్య, ఏసీపీ వెంకటరావు, సీఐ తిరుమలరావు, ఎస్ఐలు డి.సూరిబాబు, తేజేశ్వరరావు, సూర్యప్రకాషరావుతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, మురళి, పేరయ్యనాయుడు, గణేశ్వరరావు, శివప్రసాద్, జానకిరామ్, శివకృష్ణ, శ్యాంసుందరరెడ్డి, శ్రీనివాసరావు, మహేష్, రామకృష్ణ, దేముడునాయుడు, తాతారావు తదితరులు పాల్గొన్నారు.


