భీమిలిలో సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్దకు ఉదయం 10.30 గంటలకు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ర్యాలీ ప్రారంభానికి ముందే సుమారు 200 మంది పోలీసులు అక్కడికి చేరుకుని నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. చిన్న శ్రీను నోటీసు తీసుకోకపోవడంతో స్థానిక నేతలకు అందించారు. ర్యాలీ నిర్వహించలేదని, అరెస్టు చేసే అధికారం లేదని చిన్న శ్రీను పోలీసులతో వాదించారు. అనంతరం కోలాటం నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు అక్కడే కోలాటం, తీన్మార్తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైదానం వద్ద బైఠాయించి సుమారు గంటన్నరపాటు నిరసన కొనసాగించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


