మల్కాపురం: కాలం గడిచినా, వయసు పెరిగినా వారి స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదు. ఏకంగా 55 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహానికి నిదర్శనంగా షిప్యార్డ్ గాంధీగ్రామ్ హైస్కూల్లో 1970–71 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మీయంగా కలుసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి పుణే, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా తదితర నగరాల నుంచి స్నేహితులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న వారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహానికి సంబంధించిన పాటలను ఉత్సాహంగా ఆలపిస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. గత 13 ఏళ్లుగా ప్రతి ఏటా స్నేహితుల దినోత్సవం రోజున 30 మంది ఇదే విధంగా కలుసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.


