మహారాణిపేట: తర్లువాడలో ప్రతిపాదిత డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పర్యావరణ, పౌర స్వేచ్ఛా సంఘాలు, ఏఐ రెగ్యులేషన్ కూటమి, గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కే బీచ్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, స్థానిక రైతుల జీవనోపాధికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అమలు చేసే ముందు పర్యావరణ ప్రభావ అంచనా , సామాజిక ప్రభావ అంచనా నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న తర్లువాడ దళిత రైతులకు తగిన నష్టపరిహారం, ప్రత్యామ్నాయ భూమి కల్పించాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


