లోకేష్‌ను ఎమ్మెల్యే గణబాబు హైజాక్‌ చేశారు | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ను ఎమ్మెల్యే గణబాబు హైజాక్‌ చేశారు

Feb 19 2024 5:54 AM | Updated on Feb 19 2024 10:00 AM

- - Sakshi

విశాఖపట్నం: నారా లోకేష్‌ను పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హైజాక్‌ చేశారని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్‌ ఆరోపించారు. గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన శంఖారావం సభ ప్రాంగణానికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పిన్నమనేని కల్యాణ మండపం వద్దే ఆయన ఉండిపోయారు. లోకేష్‌కు ఎక్కడ నిజాలు తెలిసిపోతాయోనని.. గణబాబు మొత్తం షెడ్యూల్‌ను మార్చేశారన్నారు. బస్సులో నాయకులతో మాట్లాడం, బూత్‌ కన్వీనర్లకు దిశా నిర్దేశం లేకుండా వేదిక వద్దకు నేరుగా లోకేష్‌ను తీసుకువెళ్లారని ప్రసాద్‌ ఆరోపించారు. టీడీపీలో జీవిత కాల బహిష్కరణకు గురైన నాయకుడి విగ్రహాన్ని లోకేష్‌ ఆవిష్కరించేలా పన్నాగం పన్నారన్నారు.

శంఖారావం సభలకు స్పందన కరువు
జగదాంబ:
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆదివారం నగరంలో నిర్వహించిన శంఖారావం సభలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయగా.. ప్రజలు మాత్రం ముఖం చాటేశారు. జనాలు లేకపోవడంతో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభ ఆలస్యంగా మొదలైంది. జనాలను తరలించడానికి తెలుగుదేశం నాయకులు నానా పాట్లు పడ్డారు. అయినప్పటికీ జనం వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. వచ్చిన కొద్ది మంది లోకేష్‌ రొటీన్‌ ప్రసంగంతో విసుగు చెందారు. ఆయన మాట్లాడుతుండగానే.. సభ నుంచి మెల్లగా జారుకున్నారు. ఆయా సభల్లో లోకేష్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement