న్యూస్రీల్
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రూ.6.42 కోట్లు
వికారాబాద్: సన్న బియ్యం బోనస్ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. రెండు సీజన్లకు సంబంధించిన డబ్బు జమకాలేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వింటాలు సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యం విక్రయించి ఏడాది కావస్తున్నా బోనస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. నిర్వాహకులు ఈ రోజు రేపంటూ కాలయాపన చేస్తున్నారు. 2025 యాసంగికి సబంధించిన బోనస్ డబ్బులు పెండింగ్లో ఉండగా 2026లో రికార్డు స్థాయిలో సన్నాలు సేకరించారు. డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండంతో పలువురు రైతులు ఈ సారి ప్రైవేటుగా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు.
రికార్డు స్థాయిలో..
రెండు మూడు సీజన్లతో పోలిస్తే గత యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. 92వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేటుగా పోనూ 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు కొను గోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేరకు సేకరించారు. దొడ్డు రకం తోపాటు 8,421మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన బోనస్ డబ్బులు రూ.4.46 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2026 యాసంగిలో 90వేల ఎకరాల్లో వరి పంట వేయగా 1.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటితో పాటు 3,900 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.1.96 కోట్లు చెల్లించాల్సి ఉంది.
రెండు సీజన్లుగా జమకాని నగదు
2025 యాసంగిలో సేకరించిన ధాన్యం 8,421 మెట్రిక్ టన్నులు
చెల్లించాల్సిన మొత్తం రూ.4.46 కోట్లు
2026 యాసంగిలో 3,900 మెట్రిక్ టన్నులు
చెల్లించాల్సిన డబ్బు రూ.1.96 కోట్లు


