తడ: భర్త ఫోనులో మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన గురువారం రాత్రి తడలో చోటుచేసుకుంది. ఎస్ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అర్జున్పూర్ గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ భార్య పూజావర్మ, నాలుగేళ్ల కుమారుడితో కలిసి తడ బజారు, ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్నాడు. పరిశ్రమ విధులకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసిన పూజ శుక్రవారం పండుగ కోసం కట్టెలు కావాలని తెలపడంతో తనతోపాటు పనిచేసే దయాకర్ అనే వ్యక్తి ద్వారా కట్టెలు ఇంటికి పంపాడు. తలుపులు తెరిచి ఉంచడంతో దయాకర్ ఇంట్లోకి నేరుగా వచ్చాడు. ఆగ్రహించిన పూజ విషయం భర్తకు తెలపడంతో తలుపులు తెరిచి ఉంచిన భార్యనే మందలించాడు. మనస్తాపానికి గురైన భార్య గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉన్న చిన్నారి ఏడుపు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందడంతో భర్తకు సమాచారం అందించారు. దీనిపై మృతురాలి భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


