నాయుడుపేట టౌన్: అతివేగమే ఇద్దరి ప్రాణాలను కబళించిన ఘటన నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టమాట లోడు వాహనాన్ని తొందరగా అన్లోడ్ చేయాలన్న ఆలోచనతో అతివేగంగా వెళుతున్న టాటా ఏసీ ట్రక్కు వాహనం రోడ్డుపై ప్రమాదానికి గురై నిలిపి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొంది. టాటా ఏసీ వాహనం క్యాబిన్లో ఉన్న నెల్లూరు ప్రాంతానికి చెందిన డ్రైవర్ యామాల ఏడుకొండలు(30), అతని సమీప బంధువైన ఇండ్ల రాఘవయ్య (51) క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుని ఉన్న ఇద్దరి మృతదేహలను తీవ్రంగా శ్రమించి వెలికి తీశారు. రహదారిపై స్తంభించినన ట్రాఫిక్ను పునరుద్ధరించా రు. వివరాలు.. నెల్లూరు పట్టణంలోని లేక్యూ కాలనీకి చెందిన ఏడుకొండలు టాటా ఏసీ ట్రక్కు వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని సమీప బంధువైన అదే ప్రాంతానికి చెందిన ఇండ్ల రాఘయ్యను తీసుకుని మదనపల్లిలో టమాట లోడును తీసుకువచ్చేందుకు వెళ్లారు. అక్కడి నుంచి లోడు తీసుకుని తిరిగి వస్తుండగా నాయుడుపేట పట్టణం దాటిన తర్వాత అయ్యప్పరెడ్డిపాళెం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై నిలిపి ఉన్న లారీని అతివేగంగా వెళ్లి ఢీకొట్టారు. అంతకు ముందే ఇక్కడి రహదారిపై ముందు వెళుతున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న కారుతో పాటు మరో లారీ ఒకదానికొకటి ఢీకొని ఉన్నాయి. అప్పటికీ ఈ వాహనాలు సిగ్నల్ వేసి ఉండగా టమాట లోడుతో వస్తున్న టాటా ఏసీ వాహనం దీనిని గుర్తించకుండా వేగంగా వచ్చి లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్తో పాటు అతని పక్కనే ఉన్న రాఘవయ్య కూడా మృతిచెందాడు. మృతిచెందిన డ్రైవర్ ఏడుకొండలుతో పాటు రాఘవయ్య వడ్డెర సంఘానికి చెందిన వారు కావడంతో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు గుంజి సుధాకర్, తురక గోపి తదితర నాయకులు నాయుడుపేటకు చేరుకుని పోస్టుమార్టమ్ త్వరితగతిన పూర్తి చేసేలా పోలీసులతో మాట్లాడి చర్యలు చేపట్టారు.


