ఏర్పేడు: ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్పేడు, మర్రిమంద, వికృతమాల దళితవాడ, గోవిందవరం, పల్లం దళితవాడలలో 2024 నుంచి జరిగిన పలు చోరీ కేసులను ఏకకాలంలో ఏర్పేడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరాలకు ఉపయోగించిన ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రేణిగుంట పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో పత్రికా సమావేశం నిర్వహించి తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ ఏ.శ్రీనివాసులు వెల్లడించారు.
జల్సాలకు అలవాటుపడి..!
ఏర్పేడు మండలం మోదుగులపాళెం పంచాయతీ కుమ్మరమిట్టకు చెందిన యానాది విజయ్ విక్టర్ రాజ్(22), యానాది డేవిడ్ కుమార్ (19) ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులు. యానాది విక్టర్ విజయరాజ్ తిరుపతిలోని ఆటోనగర్లో ఉన్న రంగనాథ్ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రికల్ కోర్సు చదివాడు. వీరిద్దరూ మద్యపానం, జల్సాలకు అలవాటు పడి, దానికి అవసరమైన డబ్బు కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితులిద్దరి కదలికలపై నిఘా పెట్టి శుక్రవారం ఏర్పేడు సమీంలోని కోబాకకు వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ వంతెన కింద ఉండగా, అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరి వద్దనున్న రూ.9,75,000 విలువ చేసే 75 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షలు విలువ చేసే మోటార్బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏర్పేడు సీఐ బి.శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, ఏఎస్ఐ ధర్మసింగ్, కానిస్టేబుళ్లు అరుుణ్కుమార్, గుర్రం మునేంద్ర బాబును ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారన్నారు.
భార్యపై దాడి
తిరుపతి క్రైం : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెతో గొడవపడి రోకలి బండతో దాడి చేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జయానగర్కు చెందిన షేక్ సయ్యద్ (55) గతంలో డ్రైవర్గా పనిచేసేవాడు. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. అతడి భార్య షేక్ మల్లిక (45) టైలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, భార్య మల్లికపై సయ్యద్ కొంతకాలంగా అనుమానం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తాజాగా ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన సయ్యద్.. మల్లికపై రోకలి బండతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మల్లికకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆమెను తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. బాధితురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సయ్యద్పై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


