
వచ్చే జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హైటెక్ సిటీలో...
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైటెక్సిటీలోని హెచ్ఐసీసీ కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ మహాసభల్లో దేశవిదేశాలకు చెందిన 2 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తునట్టు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ వీఎల్.ఇందిరాదత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆవిర్భవించినట్టు చెప్పారు.
వ్యాపార, వాణిజ్య సంబంధాల విస్తరణ
తెలుగు వారి మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మహాసభల్లో మొదటి రోజు పలు వ్యాపార అంశాలపై సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక తెలుగు సాహిత్యం వరకు జరిగిన పరిణామాన్ని, సినీ, సాహిత్య రంగాల్లో వచి్చన మార్పులను కళా ప్రదర్శనల్లో ఆవిష్కరిస్తారు. మిగతా రెండు రోజుల సభల్లో వివిధ దేశాల నుంచి, తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమావేశాలు, కళా ప్రదర్శనలు ఉంటాయి.
ఇదీ ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే చోటకు చేర్చాలనే లక్ష్యంతో 1993లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. రెండేళ్లకో సారి మహాసభలను నిర్వహిస్తున్నారు. ఇప్ప టివరకు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ, సింగపూర్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలో ఈ మహాసభలు జరిగాయి. హైదరాబాద్లో రెండవసారి మహాసభలు వచ్చే జనవరిలో జరగనున్నాయి.