
ఇంటి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు
24గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరామ్నాయక్
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.
ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు.
సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..
జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు.
ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు.