కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు | Warangal Mother And Son Incident | Sakshi
Sakshi News home page

కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

Jun 29 2025 11:25 AM | Updated on Jun 29 2025 12:41 PM

Warangal Mother And Son Incident

కన్న కొడుకు కిరాతకం

 చావుబతుకుల్లో తల్లి

వరంగల్‌ జిల్లాలో ఘటన 

సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. 

కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్‌ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. 

వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్‌కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్‌ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.  సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ రూ.2 వేలు, డిపాజిట్‌ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్‌ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. 

దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్‌ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్‌లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు.   భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ శనివారం తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement