ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా 'మీ టికెట్' (MeeTicket) యాప్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నారు.
ఆర్టీసీ (RTC), మెట్రో (Metro), ఆటోలు-క్యాబ్స్ (Cabs) లాంటి ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్లో అనుసంధానమవుతాయి. ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్తో పాటు తను వెళ్లాల్సిన చోటుకి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్ని కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రయాణికులు చెల్లించిన రుసుముని ఆయా రవాణా విభాగాలు/భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా జమ చేసే ఆధునిక చెల్లింపు వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఆర్టీసీ సొంతంగా ఆటోలని కొనుగోలు చేసి నడుపుతుందని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికలు, ఇతర వేదికల్లో జరుగుతున్న ప్రచారాలపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలని కొనుగోలు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయదని భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చిచెప్పింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది.


