సాక్షి, సూర్యాపేట: దేశాన్ని కుదిపేసిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని.. బండి సంజయ్, సంగప్పలను కనీసం విచారించకుండానే.. రాత్రికి రాత్రే నిందితునికి బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
పోక్సో చట్టం అత్యంత బలమైన చట్టమని.. చట్టంలో 2020 లో వచ్చిన మార్పుల ప్రకారం సెక్షన్ 4లోని క్లాస్ 2(ఎఫ్) ప్రకారం, బెయిల్ ఇచ్చే ముందు, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వాలని,బాధితురాలి అభిప్రాయాలను సేకరించాలని కానీ, సైబరాబాద్ పోలీసులు మరియు ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలికి న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఏడాది పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడితే.. కేసు పెట్టిన మొదటి రోజే అరెస్ట్ చేయకుండా.. స్టేషన్ బెయిల్ ఇద్దామని చూశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటం తర్వాత 9 రోజులు దాచిపెట్టి తర్వాత లొంగుబాటు చూపెట్టారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రం బాల్క సుమన్, అశోక్ అనే వ్యక్తిని మాత్రం అన్యాయంగా నెలల తరబడి జైలులోనే ఉంచుతున్నారని మండిపడ్డారు. బాలికకు న్యాయం జరిగేవరకు చివరివరకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లనే నిందితుడు అరెస్టయ్యాడని గుర్తు చేశారు. తెలంగాణ బడేభాయ్ చోటే భాయ్ల బంధం ప్రజలకు అర్థమైందన్నారు. పోక్సో కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితుడు బండి భగీరథ్కు రాత్రికి రాత్రే బెయిల్ మంజూరు చేయించి.. ఇంటికి పంపించేందుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.


