చెంబులో 'కీ'... అదే కలిసొచ్చింది దొంగలకి | The Police Have Solved The Gachibowli Theft Case Hyderabad | Sakshi
Sakshi News home page

చెంబులో 'కీ'... అదే కలిసొచ్చింది దొంగలకి

Jun 12 2026 10:49 AM | Updated on Jun 12 2026 10:49 AM

The Police Have Solved The Gachibowli Theft Case Hyderabad

గచ్చిబౌలి చోరీ కేసును ఛేదించిన పోలీసులు

నలుగురు నిందితుల అరెస్ట్‌

పరారీలో ప్రధాన సూత్రధారి సురేష్‌ షాహీ

వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ రమేష్‌

గచ్చిబౌలి: ఇంటి యజమాని నిర్లక్ష్యంతో కలశం చెంబులో లాకర్‌ కీ పెట్టడంతోనే హిల్‌రిడ్జ్‌ విల్లాస్‌లో భారీ చోరీ చోటు చేసుకుందని, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వా«దీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నేపాల్‌లోని కైలాలి జిల్లా మోహన్యాల్‌కు చెందిన దంపతులు కమల్‌ షాహీ (32), విమల్‌ షాహీ (30)లు నగరంలోని గచ్చిబౌలి హిల్‌రిడ్జ్‌  విల్లా నంబర్‌ 73లో నివసించే ప్రకాశ్‌ పాయ్‌ వద్ద వాచ్‌మన్, సర్వెంటుగా చేరారు.

ఇంట్లోంచి వెళ్లిన కొద్దిసేపటికే.. 
ఈ నెల 6న ప్రకాశ్, ఆయన భార్య వందన, కుమారుడు అభిజిత్‌లు ముంబై వెళ్లారు. సహ నిందితుడు సురేష్‌ షాహీ కొద్ది సేపటికే కిటికీ యూపీవీసీ లాక్‌ బ్రేక్‌ చేసి ఇంటి లోపలికి వెళ్లాడు. సెంట్రల్‌ లాక్‌ తీశాడు. బెడ్రూంలో లాకర్‌పై ఉన్న కలశం చెంబులో కీతో లాకర్‌ ఓపెన్‌ చేసి బంగారు ఆభరణాలు బయటకు తీశాడు. కమల్, విమల్‌ వద్ద నగలు పెట్టాడు. ఆ సమయంలోనే పక్కనున్న వారు గమనించి సురే‹Ùను సమీప విల్లాలో ఉండే ప్రకాశ్‌ పాయ్‌ కూతురు వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి సురేష్‌ మాత్రం విల్లాలో ఉన్నాడు. కమల్, విమల్‌ ఎన్‌బీటీ నగర్‌లోని విమల్‌ సోదరి కల్పన షాహీని తీసుకొని సికింద్రాబాద్‌ నుంచి రైలులో పరారయ్యారు. మరునాటి ఉదయం సురేష్‌ కూడా విల్లా నుంచి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచి్చన ప్రకాష్‌ పాయ్‌  లాకర్‌లో నగలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.  

ఫోన్‌ నంబర్‌ ఆధారంగా.. 
ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు ఎన్‌బీటీ నగర్‌కు ఆటో వెళ్లినట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. కొత్త సిమ్‌ కార్డు కవర్‌పై ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ఉదంపూర్‌లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఎస్‌టీఎఫ్‌ పోలీసుల సహకారంతో కమల్, విమల్, కల్పన, పనిలో చేరి్పంచిన బిశ్వ కర్మను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన సూత్రధారి సురేష్‌ షాహీ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement