సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గారెడ్డేనని సీఎం రేవంత్ ప్రశంసించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఆయన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ప్రత్యేకంగా జగ్గారెడ్డి గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నా దోస్తు. జగ్గారెడ్డి నేను నిలబడను అంటే కాదు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. ఇంకోసారి జగ్గారెడ్డి అలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి’ అని సరదాగా మాట్లాడారు.
‘ప్రజల కోసం పరితపించే నాయకుల్లో జగ్గారెడ్డి నంబర్ వన్. జగ్గారెడ్డి గెలిచి ఉంటే మంచి పదవిలో ఉండేవారు. ఓడిపోయినా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి జగ్గారెడ్డి. వెయ్యి కోట్లు, వజ్రాలు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి వారు దొరకరు. జగ్గారెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయాలో రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. రాహుల్ గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనమంతుడు. రాహుల్ గాంధీ గీసిన గీత జగ్గారెడ్డి ఎప్పుడూ దాటడు. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ఓ సోదరుడిగా జగ్గారెడ్డికి అండగా ఉండాలని కోరుకుంటున్న’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.


