కేసీఆర్‌కు నోటీసులు ఎందుకిచ్చారు? | BRS MLC Kavitha Maha Dharna On 4th June To Protest Against Notices Issued To KCR, More Details Inside | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు నోటీసులు ఎందుకిచ్చారు?

Jun 1 2025 3:09 AM | Updated on Jun 1 2025 6:02 PM

Mahadharna on 4th June to protest against KCR notices

కాళేశ్వరంతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా?

పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్‌

కేసీఆర్‌కు నోటీసులను నిరసిస్తూ జూన్‌ 4న మహాధర్నా

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన

బంజారాహిల్స్‌: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఎందుకిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో శనివారం ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో 200 టీఎంసీల నీటి హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని తెలిపారు. 

ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్‌ కమిషనా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ జూన్‌ 4న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణ సోయితో కేసీఆర్‌ పరిపాలన చేశారని, సీఎం రేవంత్‌రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్‌ చేశారు. జై తెలంగాణ అననివారికి, అమర వీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని అన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం పేరు మార్చి అమరులు శ్రీకాంతాచారి, యాది రెడ్డి, కాళోజీ, పీవీ నరసింహారావులలో ఎవరిదో ఒకరి పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

బనకచర్లపై రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడరు?
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ నీటిని తరలించుకుపోయే ప్రణాళిక వేస్తుంటే సీఎం రేవంత్‌ కనీసం స్పందించడం లేదని కవిత విమర్శించారు. జూన్‌ 2న సీఎం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ బిల్లును డీప్‌ఫ్రిడ్జ్‌లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తా మన్నారు. జాగృతిలో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌ విభా గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విభా గాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని వెల్ల డించారు. కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్‌ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement