సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ కోర్టు విచారణ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసర ప్రాంతాలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు వచ్చారు.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ.54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్గా ఉన్న అర్వీద్ కుమార్ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది.
ఇదీ చదవండి: కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చింది: దానం


