సీసీఎల్ఏ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశాం
జీఓ 118 కింద 9,792 దరఖాస్తుల క్రమబద్ధీకరణకు మెమో జారీ
శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటన
సింగరేణి ఏరియాలో ఇళ్ల స్థలాల అంశంపై నేడు సమావేశం
ఆ తర్వాత క్రమబద్ధికరణపై ప్రభుత్వం నిర్ణయం
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో 22ఏపై రెండు రోజుల్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత కేటగిరీలో ఉన్న భూసమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కార్యాచరణ చేపట్టిందన్నారు. శుక్రవారం శాసనసభలో జీరోఅవర్లో 22ఏపై మంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 22ఏ విషయంలో మొత్తం 12 రకాల అంశాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీటిని గరిష్టంగా నెలరోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జీఓ 118 ద్వారా క్రమబద్ధికరణ చేసేందుకు 9,792 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఈ అంశాన్ని పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ హామీకి అనుగుణంగా బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ 118 సమస్యల పరిష్కారానికిగాను శుక్రవారం మెమో జారీ చేసిందని వివరించారు. దాదాపు 22, 23 కాలనీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, శనివారం మధ్యాహ్నం అర్హతలున్న వారికి క్రమబద్ధికరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తామని, నిషేధిత జాబితా నుంచి ఆయా ప్లాట్లను తొలగిస్తామన్నారు.
సింగరేణి పరిధిలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో శనివారం అసెంబ్లీ హాలులో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జారీ చేసిన జీఓ 76పై ఈ సందర్భంగా చర్చిస్తామన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. అధీకృత లేఅవుట్లకు సంబంధించి 22ఏ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ
రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సమస్యలను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేశ్కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా న్యాయ, శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి పాపిరెడ్డి సభ్యులుగా మెంబర్ కన్వీనర్గా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్గాంధీ హన్మంతు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్కుమార్ శుక్రవారం జీఓ 564 జారీ చేశారు.
నాలుగు రకాల కేసులపై ప్రత్యేక దృష్టి
సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పెండింగ్ కేసులను ఈ కమిటీ పరిశీలించి పరిష్కరించనుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అధికారుల అనుమతులతో ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పెండింగ్ వ్యవహారాలను పరిశీలిస్తుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో లీజుహోల్డ్ ఆస్తులను ఫ్రీహోల్డ్గా మార్చే అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ కేసుల పరిశీలనలో భాగంగా అవసరమైన రికార్డులు, సమాచారాన్ని ఏ శాఖ నుంచైనా, శాఖాధిపతులు లేదా జిల్లా కలెక్టర్ల నుంచి కమిటీ కోరవచ్చు.
అవసరమైతే ఇతర అధికారులను కూడా కమిటీలో సహ సభ్యులుగా చేర్చుకునే అధికారం ప్రభుత్వం కల్పించింది. దీంతో 22ఏ నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన పలు ఆస్తుల వ్యవహారాలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది.
⇒ జీఓ 118 దరఖాస్తుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్ శుక్రవారం మెమో 46940 జారీ చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నెలరోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.


