సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు ఇవాళ ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష కోట్లు కొల్లగట్టామని రేవంత్రెడ్డి అంటున్నారు. రేవంత్కు మంచి ఆఫర్ ఇస్తున్నా. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాం. మిగతా రూ. 99 వేల కోట్లు మీరే తీసుకోండి.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఖర్చు చేయండి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఆ డబ్బులతో విద్యార్థుల బకాయిలు చెల్లించండి. ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాళేశ్వరంలో లక్షకోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారంచేస్తున్నారు. హామీలను రేవంత్ గాలికొదిలేశారు. గత మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరకు వాళ్ల టార్గెట్ అంతా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడమే.. కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీలోని నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ హరాస్ చేస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారం రేవంత్ సర్కార్ టార్గెట్ కావాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.
రైతులకు ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ, 15వేల రైతు భరోసా, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కరెంటు కావాలని రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. లక్ష కోట్లని కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారు. కేసీఆర్పైన ఆయన కుటుంబంపైన రేవంత్ విషం చిమ్ముతున్నారు.
ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు మంచి పేరు తెచ్చే విషయం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే ఫార్ములా ఈ-రేస్. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ఏర్పాటు చేస్తే దానిపై విషం చిమ్ముతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రెండుసార్లు కోర్టుకు నేను హాజరయ్యాను. కోర్టుకు నేను సహకరిస్తాను. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి విచారణకు హాజరవుతాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్


