యశవంతపుర: ‘నీకు పాలు ఇష్టం లేకుంటే తాగడం మానేయాలి. కానీ ఇలా రీల్స్ చేసి పోస్టు చేయడం తప్పు’ అని ఓ మహిళా వైద్యురాలికి హైకోర్టు అక్షింతలు వేసింది. వివరాలు కేఎంఎఫ్ నందిని పాలు విషపూరితమంటూ వైద్యురాలు డాక్టర్ శరణ్య పద్మాపై బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ కేసును రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణ సాగింది. ఆ పాలు విషపూరితం అంటూ ఎలా చెప్పగలరని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఇలా రీల్స్ చేసి ప్రజలు, వినియోగదారులను గాభరా పెట్టడం సబబేనా? అని అడిగారు. పాలను పరీక్షించి ధృవీకరించుకున్నారా అని ప్రశ్నలు వేశారు. పాలు బాగా లేకుంటే తాగవద్దు, ఇన్స్టాలో ఇలాంటి రీల్స్ పోస్టు చేస్తారా? అని జడ్జి మందలించారు. నీపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
ఏమిటీ గొడవ?
డాక్టర్ శరణ్య పద్మా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో వీడియో, రీల్స్ను పోస్టు చేశారు. నందిని బ్రాండ్ క్రీమ్ బన్, స్ట్రాబెర్రి ఫ్లేవర్ పాలు, పనీర్, ఇతర పదార్థాలు కల్తీగా ఉన్నట్లు చెప్పారు. శరీరానికీ హాని కలిగించే రసాయనాలున్నట్లు ఆమె ఆరోపిస్తూ, వీటిని సేవిస్తే ఆటో–ఇమ్యూన్ వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆమెపై కేఎంఎఫ్ అధికారులు కేసు వేశారు.


