ఏంటి నాన్నా..! పిక్నిక్‌ అని చెప్పి.. బిర్యానీ తినిపించి.. చివరికి మమ్మల్ని? | Incident At Nizamsagar Project, Father And Children Commit Suicide, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఏంటి నాన్నా..! పిక్నిక్‌ అని చెప్పి.. బిర్యానీ తినిపించి.. చివరికి మమ్మల్ని?

Jun 13 2026 2:21 PM | Updated on Jun 13 2026 4:05 PM

Incident At Nizamsagar Project: Father And Children Commit Suicide

నోట్లోకి నీళ్లు పోతున్నాయ్‌ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న..

ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలతో కఠిన నిర్ణయం

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఘటన

ముగ్గురి మృతదేహాలు వెలికితీత

నిజాంసాగర్‌: సాగర తీరంలో ఘోరం పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి ‘‘ నాన్నా.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మమ్మల్ని పిక్నిక్‌కు వెళ్దామని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తీసుకొచ్చావు. హోటల్‌ నుంచి బిర్యానీ తెచ్చి ఆప్యాయంగా తినిపించావు. నీళ్లలో సరదాగా ఆడించావు. ఫోన్‌లో సెల్ఫీ ఫొటోలు తీశావు. తెప్పపై జలాశయం మధ్యలోకి తీసుకొచ్చావు. అప్పటి వరకు మాతో బాగానే ఉన్నావు. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు. నోట్లోకి నీళ్లు పోతున్నాయ్‌ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. అమ్మకు, నీకు మధ్య గొడవలైతే మేమేం పాపం చేశాం.. నీ దగ్గర డబ్బులు లేకపోతే కారం బువ్వ పెట్టినా తింటాం..మీ కడుపున పుట్టడమే మేము చేసిన నేరమా?’’ అని ఎంత వేడుకున్నాయో ఆ పసి హృదయాలు. వారి వేదన వినిపించుకోలేని స్థితిలో ఉన్నా ఆ తండ్రి.. క్షణికావేశంలో తాను సైతం నీళ్లలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి..
నిజాంసాగర్‌ ప్రాజెక్టు 20 గేట్ల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి, తండ్రి సైతం తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పిల్లల ఆలనా, పాలన చూసుకోవాల్సిన తండ్రి తనతోపాటు తన పేగుబంధం లేకుండా చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు కుమారుడు రక్షిత్‌(9), కూతురు అనన్య(5) ఉన్నారు. సరైన ఉపాధి లేక దంపతులిద్దరూ పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం రామచంద్రాపురానికి వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్‌లో లేబర్‌ పనిచేస్తోంది. కృష్ణ మద్యం సేవించడం, సరిగా పనిచేయకపోవడంతో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారు.


ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. గురువారం పిల్లలను పిక్నిక్‌కు వెళ్దామని బైక్‌పై నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చాడు. మత్స్యకారులు ఉపయోగించే తెప్పపై ప్రాజెక్టు మధ్యభాగంలోకి వెళ్లి పిల్లలను తోసేసి, తాను సైతం నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వరకు పిల్లలతోపాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్‌ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. నిజాంసాగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శివకుమార్‌ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూటీం, జాలర్లు కలిసి నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలు బయటికి తీశారు.

ప్రాజెక్టు నీటిలో నుంచి పిల్లలు, తండ్రి మృతదేహాలను బయటికి తెస్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసెలా విలపించారు. ఆత్మహత్యకు ముందు పిల్లలతో కలిసి తండ్రి తీసిన సెల్ఫీ ఫొటోలు, మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement