హైదరాబాద్: నగర పరిధి కొండాపూర్లోని ప్రేమ్నగర్లో నాలా పైప్లైన్లో పడి గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) ఆచూకీ 72 గంటలైనా దొరకలేదు. అధునాతన సాంకేతిక యంత్రాలతో ఐదు కిలోమీటర్ల నాలా, బాక్స్ పైప్లైన్, చెరువులలో గాలించినా కనీసం ఆనవాలు కనిపించలేదు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బాలయ్య కుటుంబంతో కలిసి 30 ఏళ్ల కిందటే నగరానికి వచ్చాడు. ప్రేమ్నగర్లో ఉంటున్న అతడు మంగళవారం రాత్రి 9.30 సమయంలో భారీ వర్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వైశాలీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద జారిపడి పైప్లైన్లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), విపత్తుల నివారణ విభాగాల సిబ్బంది గాలింపు చర్యలో పాల్గొంటున్నారు.
డ్రోన్లు, బోట్లు
బాలయ్య జాడ కోసం డ్రోన్లు, బోట్లు తదితర యంత్ర పరికరాలతో పైప్లైన్ దగ్గర మొదలుపెట్టి ఈర్ల చెరువు, గంగారం చెరువు మీదుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, పటాన్చెరులో కూడా శేరిలింగంపల్లి జోన్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది గాలించారు. వైశాలీనగర్ నుంచి భవానీపురం వరకు డ్రోన్ కెమెరాలతో, అమీన్పూర్ నుంచి పటాన్చెరు వరకు బోట్లలో పరిశీలించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఉప కమిషనర్లు, ఈఈలు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
సీఎంసీ నుంచి 200, హైడ్రా 200, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 120, అగి్నమాపక విభాగం నుంచి 20 మంది, మరోవైపు పోలీస్ సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు. ఒకవేళ నాలాలో పడితే ఎక్కడో అక్కడ దొరికే వీలుంది. కానీ, 5 కిలోమీటర్ల మేర వందల మంది సిబ్బందితో గాలించినా ఫలితం లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య అసలు పైప్లైన్లో పడ్డాడా? లేక ఇంకా ఏమైనా జరిగిందా? అనే కోణంలో ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.


