TS: ‘దళితబంధు’ సమావేశానికి వెళ్దాం..

Congress Party May Decided To Attend Dalitha Bhandu Meeting - Sakshi

హాజరవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలుకు డిమాండ్‌     

రేవంత్, భట్టి తదితరుల జూమ్‌ కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకుగాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో సోమవారం జరగనున్న ఉన్నతస్థాయి సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ తర్జనభర్జనలు పడింది. చివరకు హాజరుకావడానికి ఓకే చెప్పింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కూడా ఉంది. దీంతో ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరు కావాలా వద్దా అన్న దానిపైనా కొంత సందిగ్ధత నెలకొంది. ఆదివారం ఈ విషయాలపై చర్చించేందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తదితరులు జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశమయ్యారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశంపై వీరంతా చర్చించిన అనంతరం సమావేశానికి వెళ్లకపోతే దళితబంధు అమలుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమనే భావనను టీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రమాదముందనే అభిప్రాయానికి వచ్చారు. ‘దళితబంధు’సమావేశానికి వెళ్లడం ద్వారా ఈ పథకం అమలుపై కాంగ్రెస్‌ పార్టీ వాదనను కూడా ప్రభుత్వం ముందు ఉంచవచ్చని నిర్ణయించారు. నియోజకవర్గాలవారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో సమావేశానికి హాజరుకావాలని నేతలు నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top