సాగుకి నిల్వలు సరిపోవు | Ministers Uttam Kumar Reddy visit to Godavari projects | Sakshi
Sakshi News home page

సాగుకి నిల్వలు సరిపోవు

Aug 2 2026 5:41 AM | Updated on Aug 2 2026 5:41 AM

Ministers Uttam Kumar Reddy visit to Godavari projects

ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు

మరికొన్ని రోజులు ఆగితేనే స్పష్టత వస్తుంది 

తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు 

మంత్రులకు నీటిపారుదల శాఖ ఇంజనీర్ల స్పష్టికరణ 

గోదావరి ప్రాజెక్టులను సందర్శించిన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్, వివేక్‌

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/కడెం/మంచిర్యాల రూరల్‌(హాజీపూర్‌)/గోదావరిఖని: గోదావరి పరీవాహకంలోని శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పంటలకు సాగునీటి సరఫరాపై ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి హామీ ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు గత కొన్ని రోజులుగా వరదలు ప్రారంభమైనా ప్రస్తుతం ఉన్న నిల్వలు సాగునీటి సరఫరాకు సరిపోవని అభిప్రాయపడ్డారు.

జలాశయాలకు నీళ్లు వస్తున్నాయని తొందరపడి పంటలు వేసుకోకుండా ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులు డి.శ్రీధర్‌ బాబు, జి.వివేక్‌ వెంకటస్వామితో కలిసి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరుసగా శ్రీరామ్‌సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టును, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సైతం ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో సహచర మంత్రులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సాగునీటి సరఫరాకు సరిపోవని, తాగునీటి అవసరాలకు మాత్రం ఇబ్బంది ఉండదని మంత్రులకు ఇంజనీర్లు తెలిపారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 26 టీఎంసీల నిల్వలుండగా, తాగునీరు, మిషన్‌ భగీరథ అవసరాలకు 6 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు వివరించారు. గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన జైక్వాడ్‌ ప్రాజెక్టు నిండిందని, అక్కడి నుంచి విడుదల చేస్తున్న నీళ్లు మరో వారం రోజుల్లో శ్రీరామ్‌సాగర్‌కు చేరుకోవచ్చని తెలియజేశారు. జైక్వాడ్‌కు దిగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు తెరిచి ఉంచుతారని, దీంతో శ్రీరాంసాగర్‌కు ఆలోగా వరద రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో తాగునీటి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్‌ సూచించారు.  

ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీలు విడుదల.. 
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు 20 టీఎంసీల జలాలను కిందికి విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఇంజనీర్లు మంత్రులకు వివరించారు. ఒకవేళ మేడిగడ్డ బరాజ్‌ నుంచి నీళ్లను అన్నారం, సుందిళ్ల బరాజ్‌ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తే మళ్లీ ఆ నీళ్లను వృథాగా కిందికి విడుదల చేయాల్సి వచ్చేదని స్పష్టం చేశారు. దీంతో మూడు పంప్‌హౌజ్‌ల నిర్వహణకు వాడిన విద్యుత్‌ వృథా అయ్యేదని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

అవగాహన లేక కేటీఆర్, హరీశ్‌రావు మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశారని విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్‌పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రంలోని సాగునీటిరంగ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో ప్రస్తుతం 26 టీఎంసీల నీటికే పరిమితమైందని తెలిపారు.  

కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. నెహ్రూ హ యాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, 1949లో కట్టిన కడెం ప్రాజెక్ట్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నేటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రారంభించిన మూడేళ్లకే కూలిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా.. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రాలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement