వేదికపై కూనంనేని, మహేశ్గౌడ్, తమ్మినేని, కేటీఆర్ సరదా సంభాషణ
వాస్తవాలు రాస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నాయి
నవ తెలంగాణ 11వ వార్షికోత్సవంలో వక్తలు
పార్టీలు ముఖ్యం కాదు.. రాజ్యాంగం ముఖ్యం
ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను మీడియా ఎత్తిచూపాలి: మహేశ్ గౌడ్
నిజాలను నిర్భయంగా చెప్పే వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు: కేటీఆర్
కుర్చీ ఎక్కిన తర్వాత రాజకీయ నేతల్లో అసహనం పెరుగుతోంది: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. పత్రికలు వాస్తవాలు రాస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు మీడియాపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఏ ప్రభుత్వానికీ ఇచ్చిన వరం కాదు. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రభుత్వాలు, అధికారాలు శాశ్వతం కాదు. రాజ్యాంగమే శాశ్వతం. మీడియా ప్రభుత్వాల మంచి పనులను ప్రజలకు తెలియజేయడంతోపాటు తప్పులను ఎత్తిచూపే బాధ్యత కూడా నిర్వర్తించాలి. ప్రస్తుతం దేశంలో మీడియా స్వేచ్ఛ హరించబడుతోంది. ప్రశి్నస్తే దేశద్రోహిగా ముద్ర వేయడం, మీడియాపై ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతున్నాయి.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, పత్రికా సంపాదకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ మీడియా సంస్థలు కార్పొరేట్ గుప్పిట్లోకి వెళితే నిజాలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, దేశంలో విభిన్న అభిప్రాయాలను అణచివేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పిస్తూ అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను మీడియా ఎత్తిచూపాలని, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయిందని, నిజాలను నిర్భయంగా చెప్పేవారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనలు కొత్త తరానికి సమాజంపై ఉన్న నిబద్ధతను చాటాయని, ఆ ఉద్యమాలు తమకు కొత్త దారిని చూపించాయని చెప్పారు.
కేంద్రమంత్రి తనయుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హెచ్సీయూ భూముల వ్యవహారం వంటి అంశాలకు ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారు ముందుగా హేట్ స్పీచ్ను మానేయాలని, ఆ తర్వాతే హేట్ స్పీచ్పై చట్టాలు తీసుకురావాలని సూచించారు. జాన్వెస్లీ, కూనంనేని మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు అండగా నిలవాలని కోరారు. దోపిడీదారుల నుంచి పేదలకు మేలు జరిగేలా చూడాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం సరికాదని చెప్పారు. అధికారంలోకి వచి్చన తర్వాత రాజకీయ నేతల్లో మీడియాపై అసహసం పెరిగిపోతుందన్నారు.


