వాటి కోసం సిండికేట్లోని ఓ వ్యక్తి పరపతి ఉపయోగించి చక్రం తిప్పాడనే ప్రచారం
కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు..
గతంలో వివాదాస్పదమైన అనుమతుల ప్రక్రియ
దీంతో కొన్నాళ్లు పక్కన పెట్టేసిన ఎక్సైజ్ శాఖ...
తాజాగా 110 దరఖాస్తుల్లో 23కు అనుమతులు..
ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై అస్పష్టత
ఆ తర్వాత ‘అన్నీ చక్కదిద్దుకుని’ అనుమతులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం బార్లా తెరిచింది. వివాదాస్పదమైన మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లోనూ, అలాగే మునిసిపల్ కార్పొరేషన్లు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ పరిధిలో అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పేరిట ఈ అనుమతులు మంజూరు చేయడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఎక్సైజ్ శాఖలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అనుమతుల ప్రక్రియకు అనుసరించిన విధానాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఈ అనుమతుల వెనకాల ‘పరపతి’ ఉపయోగించిన వారికి అనుమతులు లభించినట్లు చెబుతున్నారు.
ఓ కీలక మంత్రికి సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో మైక్రోబ్రూవరీ లైసెన్స్ మంజూరుకు రూ.1.5 నుంచి 2 కోట్ల మేరకు ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది, ఈ బ్రూవరీలకు ముఖ్యులు కూడా ఓకే చెప్పడంతో దరఖాస్తులకు మోక్షం లభించినట్లు చెబుతున్నారు. దరఖాస్తుదారులు సిండికేట్గా ఏర్పడినందునే అనుమతులు సాధ్యమయ్యాయని మంజూరు చేసిన వర్గాలే చెపుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటికే ఎక్సైజ్ ఆదాయం ఏటా 23 వేల కోట్ల రూపాయలుంది.
దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ, 27,668 కోట్లకు పెంచేలా బడ్జెట్లోనే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ మైక్రో బ్రూవరీలతో ఓ మాదిరి హోటల్లోనూ బీరు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పబ్లు, వైన్స్ షాప్లతో మందు విచ్చల విడిగా అందుబాటులో ఉన్నప్పుడు ఇప్పుడు మైక్రో బ్రూవరీలతో మరింతగా అందుబాటులోకి తీసుకుని రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్నాళ్లు వేచిచూసే ధోరణి...
వాస్తవానికి, గత ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు రోజుకు 1000 లీటర్ల డ్రాట్ బీర్ తయారు చేసుకుని అమ్ముకునేందుకు వీలుగా లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం 110 దరఖాస్తులు రాగా, జనవరి నాటికే ఎవరెవరికి అనుమతులు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. కానీ, ఈ మైక్రో బ్రూవరీల అనుమతుల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని, ప్రభుత్వంలో ముఖ్యులకు వాటాల పంపిణీ జరిగిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేసిన సంగతి విదితమే.
110 దరఖాస్తుల్లో 23 దరఖాస్తులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే విధానాన్ని బహిరంగపరచకపోవడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలు జరిగాయనే అనుమానాలకు మరింత తావిస్తోంది. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారా? లేక మున్ముందు వాటికి కూడా అనుమతులు మంజూరు చేస్తారా? అన్న అంశంపై ఎక్సైజ్ శాఖ వర్గాలు స్పష్టతనివ్వడం లేదు. ముడుపుల ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పట్లో ఖండించారు. అసలు అనుమతుల మంజూరు జరగనప్పుడు అక్రమాలు ఎక్కడివని ప్రశ్నించిన ఆయన ఇంకా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియే కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లు ఈ మైక్రో బ్రూవరీల ఫైలును ప్రభుత్వం పక్కన పెట్టిందనే చర్చ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో జరిగింది. కానీ, తెరవెనుక మళ్లీ సిండికేట్ కీలక పాత్ర పోషించడం, అన్నీ చక్కదిద్దడంతో ఫైలు ముందుకు కదిలిందని సమాచారం. మొత్తంమీద మైక్రో బ్రూవరీల పేరుతో 180 రోజుల్లో ఏర్పాటు చేసుకునేందుకుగాను 23 దరఖాస్తులను ఆమోదించగా, అందులో ఇప్పటికే సిద్ధంగా నాలుగు సంస్థలకు లైసెన్సులు జారీ చేసేందుకూ ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది.
మరింత బార్లా తెరవడమేనా?
హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరాల్లో పర్యాటకరంగం, ఐటీ రంగాన్ని ఆకర్షించడానికి; గ్లోబల్ కల్చర్కు అనుగుణంగా ఆహార–పానీయ సంస్కృతిని అందించడమే లక్ష్యంగా ఈ మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతినిస్తున్నట్లు ప్రభు త్వం చెబుతోంది. అయితే ఈ డ్రాట్ బీర్ ను బాటిల్స్లో సరఫరా చేయకుండా.. ఆ హోటళ్లలో అక్కడే కూర్చుని సేవిస్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ విమర్శకులు మాత్రం లైసెన్స్ సంఖ్య పెంచడం వల్ల నగరంలో మద్యం విక్రయాలు పెరగడమేకాక.. మరింతగా అందుబాటులోకి వస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు.


