హైదరాబాద్‌: వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష | Cm Revanth Reddy Review On Rains In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

May 16 2024 8:30 PM | Updated on May 16 2024 8:52 PM

Cm Revanth Reddy Review On Rains In Hyderabad

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా ప్రాంతాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్‌, గచ్చిబౌలి, చార్మినార్‌, మలక్‌పేట్‌, నాగోల్ కుండపోత వర్షం కురిసింది.

భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్‌ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్‌ పాస్‌ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement