భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్‌మేట్‌ శివతో వివాహేతర సంబంధం | Sangareddy SP Reveals Shocking Facts In Ameenpur 3 Children And Mother Incident, Details Inside | Sakshi
Sakshi News home page

Ameenpur Incident: భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్‌మేట్‌ శివతో వివాహేతర సంబంధం

Apr 3 2025 10:00 AM | Updated on Apr 3 2025 10:57 AM

Ameenpur 3 Children Incident Shocking Facts

సంగారెడ్డి జోన్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్‌ మేట్‌ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.

రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్‌ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్‌మేట్‌ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.

 దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్‌ తీసుకొని చందానగర్‌ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్‌ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్‌ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. 

పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్, డీఐ రాజు, ఎస్‌ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement