కర్ణాటక, తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు.
పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు.
సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది.


