టీఎంసీ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం | - | Sakshi
Sakshi News home page

టీఎంసీ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 2:16 PM

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తమిళ మానిల కాంగ్రెస్‌ పార్టీ వైదొలిగింది. చైన్నె ఎగ్మోర్‌లో ఆదివారం టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌ అధ్యక్షతన జరిగిన అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. .

ఈ సమావేశంలో తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మెజారిటీ నాయకులు కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని, కాబట్టి కూటమి నుండి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్‌ను కోరారు. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయాల వైపు చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు. 

నాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఏదో ఒక పార్టీ గుడ్డిగా సాహసం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన.. వారే ఎల్లకాలం విజయం సాధిస్తారని తాను భావించడం లేదన్నారు. ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా ఎప్పుడో బలహీనపడిందని, టీఎంసీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే ఒక్క ఎన్నికలలోనూ గెలవలేక పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని అందుకే ఇప్పుడున్న కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తామని, బలోపేతం దిశగా వెళ్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement