టెక్కలి: అక్కవరం రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం యూరియా పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంది. రైతు సేవా కేంద్రానికి వచ్చిన సుమారు 232 యూరియా బస్తాలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే యాప్లో పేర్కొన్న మేరకు యూరియా పంపిణీ చేయడంతో గతంలో ఎదురైన అనుభవాల మేరకు మిగిలిన రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంటుందనే భయంతో ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు చేసేది లేక యూరియా పంపిణీ నిలిపివేసి రైతు సేవా కేంద్రానికి తాళాలు వేశారు. ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం చేరుకున్నారు. మొదట 50 సెంట్లు భూమి ఉన్న వారికి యూరియా ఇవ్వమని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే అడ్డదారిలో కొందరికి, యాప్లో పేర్కొన్నట్లు కాకుండా అధికంగా ఇంకొందరికి యూరియా ఇవ్వడంతో తమకు ఒక్క బస్తా అయినా దక్కుతుందో లేదోనని అధికారులను నిలదీయడంతో గందరగోళం నెలకొంది.


