శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎస్సీ వర్గీకరణతో మాలలకు ఒరిగేదేమీ లేదని మాలల ఐక్యత రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఈ బృందం ఏప్రిల్ 25వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభించిన మాలల ఐక్యత చైతన్య యాత్ర ఆదివారం శ్రీకాకుళం చేరుకుంది. ఈ మేరకు నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వలన ఏ ఒక్కరికీ మేలు జరగడం లేదని, మాదిగ సామాజికవర్గంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని, రెల్లి సామాజిక వర్గానికి అత్యంత నష్టం జరిగిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఎస్సీ రిజర్వేషన్ 15 శాతంగానే ఉందని, ప్రస్తుతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. క్రిస్టియానిటీ పేరుతో దళితుల మధ్య చిచ్చుపెట్టి విభజించడం తగదన్నారు. కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు, జిల్లా రెల్లి కుల సంక్షేమ సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


