ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం పట్టణంతో పాటు పోలింగ్ కేంద్రాలు 56, 57, 58, 59లో ‘సర్’ పురోగతి మందగించిందని, శుక్రవారం రాత్రిలోగా 90 శాతం లక్ష్యాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలని, ద్వంద్వ ఓటర్లను తొలగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి, ఏఈఆర్ఓ, సహాయ ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్తో పాటు మండల స్థాయి అదనపు సిబ్బంది ప్రతి రెండు గంటలకు ఒకసారి పురోగతిని సమీక్షిస్తూ 90 శాతం లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన శుక్రవారం లొద్దపుట్టిలో ఉన్న 56,57,58,59 పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆంధ్రా, ఒడిశా రెండు చోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు గుర్తించి తొలగించాలని ఆదేశించారు.
నిధుల గోల్మాల్పై విచారణ ప్రారంభం
రణస్థలం: పైడిభీమవరం పంచాయతీలో గత ఏడాదిలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలపై రణస్థలం ఎంపీడీఓ ఎం.ఈశ్వరరా వు శుక్రవారం విచారణ ప్రారంభించారు. సు మారు రూ. 9.43 కోట్ల నిధుల ఒకే ఏడాదిలో విత్డ్రా చేసి గోల్మాల్ చేయడంపై పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు డీఎల్పీఓను తొలుత విచారణ అధికారిగా నియమించారు. తర్వాత కూటమి నేతల అండతో ఎంపీడీఓను నియమించారు. ఈ విచారణపై ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ రికార్డులు పరిశీలిస్తున్నామని, మరో మూడు రోజుల పాటు రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు.


