కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గొడవపడ్డ యశస్వి జైశ్వాల్, అషిథా ఫెర్నాండోలకు భారీ షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) వారిద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.
జరిమానా పాటు ఇద్దరికి చెరో డిమెరిట్ పాయింట్ను కూడా ఐసీసీ కేటాయించింది. ఆటగాళ్లిద్దరూ తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి అధికారిక విచారణ లేకుండానే మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ శిక్షను ఖరారు చేశారు.
కాగా గడిచిన 24 నెలల్లో వారిపై ఎలాంటి క్రమశిక్షణా రికార్డు లేకపోవడంతో జైశ్వాల్- అసిథాలు సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ డిమెరిట్ పాయింట్లు రెండు ఏళ్ల పాటు వారి రికార్డులో కొనసాగుతాయి.
ఏమి జరిగిందంటే?
ఈ రెండో తొలి రోజు ఆటలో జైశ్వాల్ 53 బంతుల్లో 45 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించాడు. అయితే అసిథా ఫెర్నాండో వేసిన 17వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తర్వాత.. అదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఫెర్నాండో కాస్త దూకుడుగా సెల్రబేషన్స్ చేసుకున్నాడు.
ఈ శ్రీలంక స్పీడ్ స్టార్ జైశ్వాల్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. దీంతో పెవిలియన్కు వెళ్తున్న జైస్వాల్ వెనక్కి తిరిగి బౌలర్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా వచ్చి తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణుగింది.
చదవండి: మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్


