లండన్‌లో క్రికెటర్‌ మరణం.. నివాళులు అర్పించిన భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లు | Why India and England players Wearing black armbands on Day 5 of Leeds Test | Sakshi
Sakshi News home page

లండన్‌లో క్రికెటర్‌ మరణం.. నివాళులు అర్పించిన భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

Jun 24 2025 4:23 PM | Updated on Jun 24 2025 4:39 PM

Why India and England players Wearing black armbands on Day 5 of Leeds Test

PC: BCCI

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు (Indv s Eng 1st Test) ఐదో రోజు ఆట సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్‌ ఆర్మ్‌ బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ దోషి (Dilip Doshi) మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. కాగా భారత్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి 77 ఏళ్ల వయసులో లండన్‌ (London)లో కన్నుమూశారు.

చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర
గుండెపోటు కారణంగా ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా 1979- 1983 మధ్య కాలంలో దిలీప్‌ దోషి భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీసి.. జట్టు చారిత్రాత్మక విజయానికి దోహదం చేశారు.

ఇక తన కెరీర్‌లో మొత్తంగా 33 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిలీప్‌ దోషి  114 వికెట్లతో సత్తా చాటారు. అదే విధంగా.. పదిహేను వన్డేలు ఆడి 22 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ క్రికెట్‌ జట్లకు ఆడిన ఆయన.. ఇంగ్లండ్‌ కౌంటీల్లోనూ భాగమయ్యారు. వార్విక్‌షైర్‌, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్న దిలీప్‌ దోషి.. సోమవారం మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాపంగా భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్‌ ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించారు.

తొలి రోజు.. మూడో రోజు ఆలా
కాగా.. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత​ జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా లీడ్స్‌ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతులకు సంతాప సూచకంగా తొలి రోజు ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్స్‌ భుజానికి కట్టుకుని బరిలోకి దిగారు.

అదే విధంగా.. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ డేవిడ్‌ వాలంటైన్‌ లారెన్స్‌ (61) మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మౌనం పాటించడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించారు. తాజాగా మంగళవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆటలోనూ ఇదే తరహాలో నివాళి అర్పించారు.

భారత్‌కు 10 వికెట్లు.. ఇంగ్లండ్‌కు 350 రన్స్‌
మ్యాచ్‌ విషయానికొస్తే.. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్‌ 465 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా 364 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఫలితం తేలనుంది. టీమిండియా పది వికెట్లు తీస్తే విజేతగా నిలుస్తుంది. అదే ఇంగ్లండ్‌ తమ ఓవర్‌ నైట్‌ స్కోరు (21/0)తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ విజయానికి 350 పరుగుల దూరంలో ఉంది.

చదవండి: IND vs ENG: రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement