అందుకే పిచ్‌లోని మ‌ట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్‌ శర్మ | Why Did Rohit Sharma Eat T20 World Cup Final Pitch Mud? | Sakshi
Sakshi News home page

అందుకే పిచ్‌లోని మ‌ట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్‌ శర్మ

Jul 2 2024 3:54 PM | Updated on Jul 2 2024 4:36 PM

Why Did Rohit Sharma Eat T20 World Cup Final Pitch Mud?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను భార‌త్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల త‌ర్వాత పొట్టి ప్రపంచ‌క‌ప్‌ను భార‌త్ కైవసం చేసుకుంది. అప్పుడు ఎప్పుడో 2011లో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ 13 ఏళ్ల త‌ర్వాత ప్ర‌పంచ‌కప్ ట్రోఫీని ముద్దాడింది. 

గ‌తేడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డిన భార‌త్‌.. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం ఎటువంటి పొర‌పాటు చేయ‌లేదు. ఎనిమిది నెల‌ల తిరిగక ముందే క‌ప్ కొట్టి రోహిత్ సేన‌ 140 కోట్ల మంది భార‌తీయ‌ల‌ను స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసింది. 

ఈ విజ‌యం త‌ర్వాత టీమిండియా ఆట‌గాళ్లంతా ఒక్క‌సారిగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ముఖ్యంగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గెలుపొందిన వెంట‌నే నెల‌ను ముద్దాడాడు. అంతేకాకుండా పిచ్‌లోని మ‌ట్టిని తిని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌య్యాయి. అయితే తాను ఎందుకు అలా చేశాడో తాజాగా హిట్‌మ్యాన్ వివ‌ర‌ణ ఇచ్చాడు. బార్బ‌డోస్ మైదానం ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు.

"బార్బ‌డోస్ మైదానం నాకెంతో ప్రత్యేకం. ఈ స్టేడియంలోని పిచ్ మాకు వరల్డ్‌కప్‌ను ఇచ్చింది. మా కలలన్నీ నెరవేరిన చోటు అది.  ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. పిచ్‌లోని కొంత భాగాన్ని నాలో భాగం చేసుకోవాలనకున్నాను. 

అందుకే పిచ్‌లోని మట్టిని తిన్నాను. నిజంగా ఆ క్షణాలు మరలేనివి. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నామని" బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement