Ind Vs WI: Rohit Sharma Reacted To The Team India Test Series Victory Against WI - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు

Published Tue, Jul 25 2023 8:19 AM

: We wanted to get a result out of this game: Rohit Sharma  - Sakshi

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్న టీమిండియా కల నెరవేరలేదు. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో వర్షం కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్‌ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు.  ఆఖరి సెషన్ వరకూ ఎదురుచూసిన అంపైర్లు వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో .. ఆఖరి రోజు ఆటను రద్దు చేశారు.

తద్వారా తొలి టెస్టు గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి వ్యక్తిగత అ‍త్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన మహ్మద్ సిరాజ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్‌ అన​ంతరం టెస్టు సిరీస్‌ విజయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.
 
"ప్రతీ విజయం మాకు సరికొత్త పాఠం నేర్పుతుంది. అది వెస్టిండీస్‌లో ఆడినా, భారత్‌లో ఆడినా మేము ఒక ఛాలెంజ్‌గానే తీసుకుంటాం. ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. డొమినికాలో కనబరిచిన ఆట తీరునే రెండో టెస్టులో కూడా కంటిన్యూ చేశాం. మేము ఈ మ్యాచ్‌లో గెలుస్తామన్న పూర్తి నమ్మకం ఉండేది. ఆఖరి రోజు బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం.

ప్రత్యర్ది ముందు భారీ టార్గెట్‌ కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి రోజు ఆట సాధ్యపడలేదు. దీంతో ఫలితం రాకుండా మ్యాచ్‌ ముగిసిపోయింది. అయితే వాతావారణ పరిస్థితులకు సంబంధించి మనం ఏమి చేయలేం కదా. ఇక ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ తనంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడు మా పేస్‌ అటాక్‌ను లీడ్‌ చేశాడు. కానీ ప్రతీ ఒక్క ఫాస్ట్‌ బౌలర్‌ కూడా నాయకత్వం వహించే విధంగా ఉండాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను.

ఇక ఈ మ్యాచ్‌లో మాకు చాలా పాజిటివ్‌ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కిషన్‌ లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు కావాలి. అతడు దూకుడుగా ఆడి పరగులు రాబట్టాలని ముందుగా ప్రమోట్‌ చేశాం. కిషన్‌ అందుకు తగ్గ న్యాయం చేశాడు. అతడు కొంచెం భయపడలేదు. ఇక విరాట్‌ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడిని యువ ఆటగాళ్లు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుతం మా జట్టు అన్ని విభాగాల్లో సమంగా ఉంది. ఇదే జోష్‌తో ముందుకు వెళ్తామని" పోస్ట్‌ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.
చదవండిIND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు

Advertisement
Advertisement