ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్‌-3 వేలంలో వాళ్లు సైతం! | Visakhapatnam: ACA Gopinath Reddy Attend VDCA Summer Camp Event | Sakshi
Sakshi News home page

ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్‌-3 వేలంలో వాళ్లు సైతం!

Jun 1 2024 9:24 PM | Updated on Jun 1 2024 9:41 PM

Visakhapatnam: ACA Gopinath Reddy Attend VDCA Summer Camp Event

సాక్షి, విశాఖపట్నం: ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు దక్కుతుందని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి అన్నారు. అదే విధంగా క్రికెట్‌లో క్రమశిక్షణ ఎంతో అవసరం అని పేర్కొన్నారు.

వీడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్‌ క్రికెట్‌ కోచింగ్‌ క్యాంపు ముగింపు సమావేశం శనివారం జరిగింది. విశాఖలోని డా. వైఎస్సార్‌ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతిభ కలిగి.. గుర్తింపులేని క్రికెటర్లకు రైజింగ్‌ స్టార్స్‌ పేరుతో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇటీవల  చక్కటి వేదిక కల్పించాం.

దీంతో ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని ఆటగాళ్లకు మరో అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ట్రయల్స్‌ నిర్వహించి ప్రతిభ చూపిన ఏడుగురికి  ఏపీఎల్‌–3 వేలంలో స్థానం కల్పించాం’’ అని తెలిపారు.

అదే విధంగా... ప్రతి క్రీడాకారుడి గణాంకాలతో కూడిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వీలుగా ఈసారి సరికొత్త సాఫ్ట్‌ వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు. 

అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు, కోచ్‌లకు జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌.కుమార్, వీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement