శస్త్ర చికిత్స వికటించి రాష్ట్రస్థాయి టీటీ క్రీడాకారుడు హర్షవర్ధన్వర్మ మృతి!
పుట్టెడు దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలు దానం చేసిన తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.
పతకాల రేసులో నిలిచి..
బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.
లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..
బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు.


