
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఫైనల్ చేరకుండానే
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.
అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.
సోషల్ మీడియా వేదికగా
తాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.
జట్టుకు బలం అతడు
అయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్రూమ్లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.
కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?
అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.
హెడ్కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.
కెప్టెన్గానూ హిట్
కాగా గతంలో కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.
కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్గా వ్యవహరించలేదు. బ్యాటర్గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!