
2026 మహిళల టి20 ప్రపంచకప్ టైటిల్ పోరు వేదిక ఖరారు
ఇంగ్లండ్లో జూన్ 12 నుంచి జూలై 5 వరకు మెగా ఈవెంట్
దుబాయ్: సుప్రసిద్ధ క్రికెట్ మైదానం ‘లార్డ్స్’ మరో విశ్వవిజేతను తేల్చనుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ లార్డ్స్లో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. 12 జట్లు పాల్గొనే మహిళల మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జూన్ 12న మొదలై జూలై 5వ తేదీన జరిగే ఫైనల్తో ముగుస్తుంది. టోర్నీలో మొత్తం 33 మ్యాచ్లు జరుగుతాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్బాస్టన్, ద ఓవల్, హ్యాంప్షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ ఇలా ఆరు వేదికల్లో లీగ్, సహా సెమీఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. కానీ గ్రాండ్ ఫైనల్ మాత్రం విఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ వెల్లడించింది.
12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్లను నిర్వహిస్తారు. పూర్తి షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. క్రికెట్ను అమితంగా ఇష్టపడే ఇంగ్లండ్లో ప్రేక్షకులు ప్రపంచకప్కు బ్రహ్మరథం పడతారని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ‘ఉత్కంఠ భరితంగా సాగిన 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. మెరుపుల టి20 మెగా ఈవెంట్ మరింత ఆసక్తిగా సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మేం ఇక టోర్నీ ఏర్పాట్లపై నిమగ్నమవుతాం. రోమాంఛకరమైన క్రికెట్ ఆట లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో మరో దశకు చేరుతుంది’ అని అన్నారు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్ మాట్లాడుతూ మొత్తం ఏడు వేదికల్లో మహిళల టి20 ప్రపంచకప్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ టోర్నీలో భారత్, మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక ఈ ఎనిమిది జట్లు ఇదివరకే అర్హత సంపాదించాయి. మిగతా నాలుగు జట్లు మాత్రం ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధిస్తాయి. లార్డ్స్లో 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ రన్నరప్గా నిలిచింది.
ఆతిథ్య ఇంగ్లండ్పై గెలిచే స్థితిలో కనిపించిన మిథాలీ రాజ్ బృందం అనూహ్యంగా 9 పరుగుల తేడాతో ప్రపంచకప్ను చేజార్చుకుంది. పురుషుల క్రికెట్ స్థాయి ఉత్కంఠకు ఏమాత్రం తీసిపోని ఈ ఫైనల్కు రికార్డు స్థాయిలో టీవీ ప్రేక్షకులు తిలకించారు. అప్పటి నుంచి అమ్మాయిల క్రికెట్పై ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మెల్బోర్న్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్ను 86,174 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు. తదనంతరం కేప్టౌన్ (2023), దుబాయ్ (2024)లలో జరిగిన మెగా ఈవెంట్లకు టికెట్లన్నీ ముందస్తుగానే ‘సోల్డ్ అవుట్’ అయ్యాయి.