Champions Trophy 2025: ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..! | UMPIRES FOR CHAMPIONS TROPHY 2025 FINAL ANNOUNCED | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..!

Mar 6 2025 8:44 PM | Updated on Mar 6 2025 8:44 PM

UMPIRES FOR CHAMPIONS TROPHY 2025 FINAL ANNOUNCED

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించబోయే అంపైర్ల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ మ్యాచ్‌ కోసం ఐసీసీ అనుభవజ్ఞులైన మ్యాచ్‌ అఫీషియల్స్‌ను ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా పాల్‌ రీఫిల్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ వ్యవహరించనున్నారు. థర్డ్‌ అంపైర్‌గా జోయల్‌ విల్సన్‌ విధులు నిర్వహించనున్నాడు. ఫోర్త్‌ అంపైర్‌గా కుమార ధర్మసేన.. మ్యాచ్‌ రిఫరీగా రంజన్‌ మదుగలే వ్యవహరించనున్నారు. 

ఫైనల్‌ మ్యాచ్‌ అంపైర్లలో పాల్‌ రీఫిల్‌ సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో సెమీస్‌లో ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించగా.. ఇల్లింగ్‌వర్త్‌, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించాడు. నాలుగు సార్లు ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచిన ఇల్లింగ్‌వర్త్‌.. 2023 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లోనూ ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించాడు. ఇల్లింగ్‌వర్త్‌.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌కు కూడా ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించాడు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్‌ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరగా.. న్యూజిలాండ్‌ రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.

ఇదిలా ఉంటే, ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్‌, తాము గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. 
 

Advertisement
 
Advertisement
Advertisement