ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. అయితే బ్రాడ్ ఎంచుకున్న అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే ఛాన్స్ దక్కింది. ఇక ఓపెనర్లగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్తో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను బ్రాడ్ ఎంపిక చేశాడు. సంగక్కరను వికెట్ కీపర్గా కూడా బ్రాడ్ అవకాశమిచ్చాడు.
మూడో స్దానంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్, నాలుగో స్ధానంలో విరాట్ కోహ్లిలు చోటు సంపాదించుకోవడం గమనార్హం. మిడిల్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానం, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్ జాక్ కలిస్ (సౌతాఫ్రికా) ఆరో స్థానంలో ఎంపికయ్యారు.ఇక ఏడో స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్కు బ్రాడ్ ఛాన్స్ ఇచ్చాడు.
బౌలింగ్ విభాగంలో ముగ్గురు ప్రపంచ స్థాయి పేసర్లు, ఒక లెజెండరీ స్పిన్నర్కు బ్రాడ్ చోటు కల్పించాడు. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లగా మిచెల్ జాన్సన్(ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్(సౌతాఫ్రికా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) ఉన్నారు.
టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ ఈ జట్టులోని ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్. కాగా స్టువర్ట్ బ్రాడ్ 2023 జూలైలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో 167 టెస్టులు, 121 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 845 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.
స్టువర్ట్ బ్రాడ్ ఆల్-టైమ్ టెస్ట్ ఎలెవెన్ జట్టు:
గ్రీమ్ స్మిత్ (కెప్టెన్), కుమార్ సంగక్కర (వికెట్ కీపర్), రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జాక్ కలిస్, ఏబీ డివిలియర్స్, మిచెల్ జాన్సన్, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, మిచెల్ స్టార్క్.
చదవండి: భారత క్రికెట్కు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న తెలుగు ప్లేయర్


