న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ప్రకటన | Sri Lanka Announced Squad For New Zealand T20 Series | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ప్రకటన

Dec 18 2024 6:45 PM | Updated on Dec 18 2024 6:59 PM

Sri Lanka Announced Squad For New Zealand T20 Series

న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (డిసెంబర్‌ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్‌ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌ కోసం శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలగేను విడిచిపెట్టింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో తలపడిన లంక జట్టులో ఇది ఏకైక మార్పు.

ప్రస్తుతం ప్రకటించిన లంక జట్టు పేస్‌ మరియు స్పిన్‌ బౌలర్లతో సమతూకంగా ఉంది. గత న్యూజిలాండ్‌ సిరీస్‌లో అరంగేట్రం చేసిన సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ చమిందు విక్రమసింఘే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రముఖ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ  స్పిన్‌ విభాగాన్ని లీడ్‌ చేయనున్నాడు. హసరంగ స్పిన్‌ టీమ్‌లో మహీశ్‌ తీక్షణ, లెగ్‌ స్పిన్నర్‌ జెఫ్రీ వాండడ్సే ఉన్నారు.

లంక పేస్‌ విభాగాన్ని అశిత ఫెర్నాండో లీడ్‌ చేయనున్నాడు. నువాన్‌ తుషార, మతీష పతిరణ, లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బినుర ఫెర్నాండో పేస్‌ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్‌ విషయానికొస్తే.. కెప్టెన్‌ అసలంక​, నిస్సంక, కుసల్‌ పెరీరా, కుసల్‌ మెండిస్‌, చండీమాల్‌, కమిందు మెండిస్‌, భానుక రాజపక్సతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.

కాగా, న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి టీ20 డిసెంబర్‌ 28న జరుగనుంది. మౌంట్‌ మాంగనూయ్‌లోని బే ఓవల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం డిసెంబర్‌ 30వ తేదీ రెండో టీ20 జరుగనుంది. తొలి టీ20 జరిగిన చోటే ఈ మ్యాచ్‌ కూడా జరుగనుంది. వచ్చే ఏడాది జనవరి 2న మూడో టీ20 జరుగనుంది. నెల్సన్‌లోని సాక్స్టన్‌ ఓవల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. టీ20 సిరీస్‌ అనంతరం జనవరి 5, 8, 11 తేదీల్లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు..
చరిత్ అసలంక (కెప్టెన్‌), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరణ, జెఫ్రీ వాండర్సే, నువాన్ తుషార, అశిత ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ

Advertisement
 
Advertisement
Advertisement