
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి ఓటమి ఎదురైంది. ప్రపంచ ఏడో ర్యాంక్ ద్వయం మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 19–21, 16–21తో ఓటమి పాలైంది.
క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 9,062 డాలర్ల (రూ. 7 లక్షల 77 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్లతో పోటీపడ్డ నాలుగుసార్లూ విజయం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఐదో ప్రయత్నంలో మాత్రం ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం.